మెట్రో అవినీతికి భయపడే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రఘునందన్ రావు

  • మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న రఘునందన్ రావు
  • ఫేజ్-2 పనులను కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్న
  • సీఎం మాటలను మంత్రులే ఖాతరు చేయడం లేదని ఎద్దేవా

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 


హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో తెరవెనుక భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరిగాయని రఘునందన్ రావు సంచలన ఆరోపణ చేశారు. వీటిపై ఎక్కడ విచారణ జరిగి తనపై కేసులు ఫైల్ అవుతాయో అనే భయంతోనే... సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేంద్రంపై అభాండాలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.


మెట్రో ఫేజ్-2 పనులను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఎంపీ పూర్తిగా కొట్టేశారు. "రాష్ట్రానికి ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి వచ్చిన భారీ రుణం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ (పూచీకత్తు) వల్లే సాధ్యమైంది. కేంద్రమే అంతగా సపోర్ట్ చేస్తున్నప్పుడు, మెట్రో ఫేజ్-2 పనులను మోదీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది?" అని తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.


రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన తీరును రఘునందన్ రావు తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నెన్స్ ‘సుతి లేని సంసారం’ లాగా తయారైందని ఫైర్ అయ్యారు. సొంత క్యాబినెట్ మంత్రులే ముఖ్యమంత్రి మాటలను అస్సలు ఖాతరు చేయడం లేదని, అందుకే రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోయి కేంద్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


Raghunandan Rao
Revanth Reddy
Hyderabad Metro Phase 2
Telangana Politics
Metro Rail Corruption
BJP vs Congress Telangana

More Telugu News